తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి ఆరంభమైంది. తెలంగాణాలో తొలివిడత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు బుధవారం నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ బుధవారం వెల్లడించారు. ఈ తొలి దశలో తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
నామినేషన్ జారీ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పదో తేదీన పరిశీలించి, 12న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని, అదే రోజు గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.
అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నియోజకవర్గం పరిధిలోని 10 మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు చాలు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.10 వేలు చొప్పు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లించాల్సి వుంటుంది. పార్లమెంటు అభ్యర్థి రూ.70 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్థి రూ. 8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని ఆయన వివరించారు. కాగా, ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,41,01,895 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.