ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు చేదుఅనుభవాలు ఎదురవుతూనే వున్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఢిల్లీలో దక్షిణ్పురిలో రోడ్ షో నిర్వహిస్తున్న కేజ్రీవాల్కు దండ వేస్తానంటూ ఆయన దగ్గరకు వచ్చిన ఓ యువకుడు చెంపపై కొట్టబోయాడు. ఆయన పక్కకు వంగడంతో మెడపై బలంగా దెబ్బ తగిలింది. ఈ ఘటనతో అరవింద్ షాక్కు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఆ పార్టీ కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
కొద్దిరోజుల కిందట సొంత రాష్ట్రం హర్యానాలో ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. ఓటర్లు నల్లజెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. గతనెల వారణాసి ఎన్నికల పర్యటనలో ఇలాంటి చేదుఅనుభవం ఎదురయ్యింది. కేజ్రీవాల్పై రెండుచోట్ల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంకు చల్లిన విషయం తెల్సిందే! ఈ వరుస ఘటనల తర్వాత కూడా పోలీసులు ఆయనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించకపోవడంపై ఆమ్ ఆద్మీపార్టీ కార్యకర్తలు, నేతలు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.