విజయవాడ: టీడీపీ ఆకర్ష్ ఫెయిల్ అయిందా? వై.ఎస్.జగన్ ఎత్తు సక్సెస్ అవుతోందా? అక్కడ కే.సీ.ఆర్ ఇక్కడ వై.స్.జగన్లు విసిరిన వలలో 'టీ.డి.పి చిక్కుకుందా? రాజ్యసభ ఎన్నికల పరిణామాలు చూస్తే, అది నిజమనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నుంచి 17 మంది ఎం.ఎల్.ఎలను టీడీపీ చేర్చుకుంది. జంప్ జిలానీల రాకతో ఆపార్టీ తొలుత ఆనందించింది. మరికొందరిని టీడీపీలోకి తెచ్చుకుంటే రాజ్యసభలో వై.ఎస్.ఆర్సీపీకి స్థానం లేకుండా చూడొచ్చని అధినాయకుడు చంద్రబాబు నాయుడు భావించారు. పట్టుబట్టి అందుకు కోట్లు కోట్లు ముట్టచెప్పినట్లు జగన్ అనుచరులు తొలి నుంచి ఆరోపిస్తున్నారు.
టీడీపీకి మూడు స్థానాలుంటే, నలుగురిని రాజ్యసభ బరిలో నిలపాలని చంద్రబాబు ఉత్సాహం చూపారు. కానీ, ఈ ఆకర్ష్ అత్యుత్సాహానికి బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. నాల్గవ అభ్యర్థిని ఉపసంహరించాలని కేంద్ర బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీనితో వ్యయప్రయాసలతో నడిపిన ఆకర్ష్ వృధా అయిందా అనే మీమాంసలో టీడీపీ వర్గాలున్నాయి.
కావాల్సినంత ఉంచుకుని... కోవర్టులను పంపారా?
ఇక ముఖ్యంగా తనకు కావలసిన సంఖ్యని ఉంచుకుని మిగిలిన ఎం.ఎల్.ఎలను కోవర్టులుగా జగన్మోహన్ రెడ్డి పంపారా అనే అనుమానాలున్నాయి. తమ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపడం ద్వారా అన్ని ప్రాంతాలలో టీ.డి.పిలో గ్రూపులు తెచ్చి, ఆ పార్టీని బలహీనపరచాలని వేసిన ఎత్తుగడ ఫలించిందని వైసీపీలో కొందరు లోలోన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం, పశ్చిమ గోదావరితో పాటు కర్నూలు తదితర జిల్లాలలో గ్రూప్ తగాదాలు నెలకొన్నాయి. సిట్టింగులకు, జంప్ జిలానీల గ్రూపుల మధ్య వివాదాలు ఆధిపత్య పోరు పెచ్చరిల్లిపోతోంది. ఇది వచ్చే ఎన్నికలనాటికీ టీ.డీ.పిని బలహీనపరిచేందుకు ముందుగానే జగన్ వేసిన పెద్ద ఎత్తుగడగా విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు ఇలాంటి ఆపరేషన్ చేసి స్టీఫెన్సన్ ద్వారా కేసీఆర్కి దొరికిపోయి టీడీపీ అధినేత తెగ ఇబ్బందిపడుతున్నారు. తమకు తగిన సంఖ్యాబలం వుండగా అనవసరంగా జగన్ వేసిన వలలో చిక్కుకున్నట్లయిందని టీడీపీలో అసంతృప్తవాదులు పేర్కొంటున్నారు. తమ నాయకుడి చర్యపై కిందిస్థాయి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి పాచిక పారిందని, ముందున్నది ముసళ్ళ పండుగ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
కొత్తగా వచ్చి తమ ప్రాబల్యం తగ్గించి ఆధిపత్యం చలాయించాలని జంప్ జిలానీలు చేస్తున్న చేష్టలకు ఇప్పటికే సిట్టింగ్ ఎంల్ఎలలో అసంపితృప్తి చోటుచేసుకుంది. పైగా వీరిలో జగన్ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నందున జగన్ వేసిన ఎత్తుగడ నిజమే కావచ్చంటున్నారు. 17 మంది జంప్ జిలానీల మరొక నలుగురిని తమతో తెచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వారి వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేసీఆర్ చేతిలో భంగపడి, విజయవాడ వస్తే ఇక్కడ కూడా జరగబోయే పరిణామాలను పసికట్ట లేక జగన్ చేతిలో భంగపడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మూడేళ్ళు కొనుక్కున్న కొరవితో సిట్టింగ్లకు, జంప్ జిలానీలకు మధ్య సాగనున్న రగడతో తల బొప్పి కట్టక తప్పదని పేర్కొంటున్నారు.