అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. లేఖలో పేర్కొన్నట్టుగా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎడప్పాడి కె.పళనిస్వామికి గవర్నర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఆయనతో
అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. లేఖలో పేర్కొన్నట్టుగా ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎడప్పాడి కె.పళనిస్వామికి గవర్నర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఆయనతో పాటు మరో 30 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
శశికళ ఆదేశానుసారం సీఎంగా ప్రమాణం చేసిన పళనిస్వామి తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్ట్లో ఉంచి బెంగళూరు బయల్దేరనుండగా, ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమంటూ పన్నీర్ సెల్వం దివంగత నేత జయలలిత సమాధి సాక్షిగా ప్రకటించారు. ఈ నేఫథ్యంలో ఈ రెండు వర్గాలు ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నాయంటూ ఆసక్తి రేగుతోంది.
మరోపక్క ఇప్పటికే రిసార్టులోని కొంత మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు బయల్దేరారు. నియోజకవర్గాల్లో ప్రవేశించగానే వారికి అసలు పరీక్ష ఎదురైంది. పార్టీ కార్యకర్తలు వారి వాహనాలను అడ్డుకున్నారు. వారి కార్లపై మట్టి (శాపనార్థాలు పెడుతూ) పోశారు. అనంతరం కార్లపై ఉమ్మివేశారు. ఈ పరిణామాలతో పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు బిత్తరపోయారు. ఇపుడు ఎటువైపు మొగ్గు చూపాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు.
అయితే, తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 134 మంది శాసనసభ్యులు. వీరిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 20 మంది, గౌండర్ సామాజికవర్గానికి చెందినవారు 28 మంది, వన్నియర్ సామాజికవర్గానికి చెందినవారు 19 మంది, దళిత సామాజిక వర్గానికి చెందినవారు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
గతంలో జయలలిత, పన్నీరు సెల్వం మంత్రివర్గాల్లో 12 మంది దేవర్ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉండేవారు. ఇపుడు పళనిస్వామి మంత్రి వర్గంలో కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య 11. వీరంతా తొలుత పన్నీరు సెల్వంకు అండగా నిలబడతారని భావించారు.
కానీ, శశికళ కూడా దేవర్ వర్గానికి చెందినవారు కావడంతో వారందరూ శశికళకే వారు జై కొట్టారు. అయితే, వన్నియర్లతో పాటు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పన్నీర్కు అండగా నిలువనున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు తమతమ నియోజకవర్గాల నుంచి ఒత్తిడివల్ల పెక్కుమంది ఎమ్మెల్యేలు కోట్లాది మంది ప్రజలు మద్దతు పొందుతున్న పన్నీర్కు జైకొట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఎలాంటి వ్యూహంతో ప్రభుత్వాన్ని పడగొడతాడో చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.