కనుమరగవుతున్న కాంగ్రెస్... 6 రాష్ట్రాల్లోనే... ప్రియాంక గాంధీ అంటూ డిగ్గీ
ప్రాంతీయ పార్టీలు ఢంకా బజాయిస్తూ ఎన్నికల్లో రెట్టించి గెలుస్తున్నాయి. జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీట్లు, స్టేట్లు పోగట్టుకుంటూ చతికిలపడుతోంది. తాజాగా అసోం రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకుంది. కేరళలోనూ దిగజారిపోయ
ప్రాంతీయ పార్టీలు ఢంకా బజాయిస్తూ ఎన్నికల్లో రెట్టించి గెలుస్తున్నాయి. జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీట్లు, స్టేట్లు పోగట్టుకుంటూ చతికిలపడుతోంది. తాజాగా అసోం రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకుంది. కేరళలోనూ దిగజారిపోయింది. ఇక మిగిలింది కేవలం 6 రాష్ట్రాల్లోనే. అవి కర్నాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్.
ఐతే ఈ రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి అధోగతిగానే ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. ఎన్నికలు జరిగితే ఎన్ని రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పైన ఆ పార్టీకి చెందిన నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఏపీ విభజన చేసిన దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏదో చుట్టుకున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో వరుస ఓటములతో ఉన్న స్థానాలను ఊడగొట్టుకుంటూ పోతుంది. ఓడిపోయాక... విశ్లేషించుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం అని అధినేత్రి సోనియా గాంధీ చెప్పడం మామూలైపోయింది.
ఇప్పుడు రాహుల్ గాంధీ పనితనంపై పార్టీలో చాపకింద నీరులా అసంతృప్తి రగులుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన దిగ్విజయ్ మాట మార్చేశారు. తాజాగా ప్రియాంకా గాంధీ జపం చేయడం మొదలెట్టారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపధ్యంలో డిగ్గీ స్పందిస్తూ... ప్రియాంకా గాంధీ రంగ ప్రవేశం చేస్తేనే పార్టీ పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడ ఎలాగైనా పట్టు సాధించాలనీ, అది ప్రియాంకా గాంధీ వస్తేనే సాధ్యమవుతుందని ఆయన అనుకుంటున్నట్లున్నారు. ఏదైతేనేం... కాంగ్రెస్ పార్టీకి మాత్రం రానురాను గడ్డు పరిస్థితి ఎదురవుతోంది.