అఖండ భారతావని తలపై ఓ వెండి కిరీటంలా... మంచు తెరలను, ప్రకృతి సోయగాలను తనలో ఇనుమడింపజేసుకుని ఉండే కాశ్మీరం.. నేడు రావణకాష్టాన్ని తలపిస్తోంది. మనిషి కాలు బయటపెడితే.. తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేని దయనీయ స్థితిలో కాశ్మీరీ పౌరులు కాలం వెళ్లదీస్తున్నారు. భద్రతా బలగాల బూటు కాలు కవాతులు, సైనిక విన్యాసాలు, కాల్పుల మోత, కర్ఫ్యూలతో అట్టుడికి పోతోంది. దీంతో కలత చెందిన కేంద్ర పాలకులు అఖిలపక్ష రాజకీయ నేతలతో సమస్య పరిష్కారానికి చొరవ చూపారు.
కాశ్మీరీ పౌరుల జీవితాల్లో కొత్త వెలుగును నింపేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా కేంద్ర హోం మంత్రి చిదంబరం నేతృత్వంలోని 42 మంది సభ్యుల కలిగిన జంబో అఖిలపక్ష బృందం కాశ్మీరీ ప్రజలతో ముఖాముఖి సంభాషణలు జరిపింది. వారి సమస్యలు తెలుసుకుంది. ఆవేదనలను సావధానంగా ఆలకించింది. చేతనైన సాయం చేస్తామని భరోసా ఇచ్చింది. దీంతో కాశ్మీర్ పౌరులకు పాక్షిక ఉపశమనం లభించింది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన అపరిపక్వ వ్యాఖ్యలు మళ్లీ అగ్గిని రాజేసేలా కనిపిస్తున్నాయి. "కాశ్మీర్ ఓ అంతర్జాతీయ సమస్య" అంటూ సాక్షాత్ శాసనసభలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి రగులుతున్న కొలిమిలో మరిన్ని బొగ్గు ముక్కలు జోడించినట్టుగా ఉంది. దీంతో ఒక్కసారి కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికి పోయింది. విపక్ష నేతలు మండిపడ్డారు.
స్వదేశీ సమస్యను ఓ అంతర్జాతీయ సమస్యగా ఎలా చిత్రీకరిస్తారని నిలదీశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి నానా రభస చేశారు. ఒమర్ చేసిన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణకు పట్టుబట్టాయి. భేషరతుగా ఒమర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా, మిగిలిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్లో శాంతిభద్రతలను పరిరక్షించలేకనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒమర్ మాత్రం అటు కేంద్రానికి, ఇటు విపక్షాల మాటలను వింటూ చోద్యం చూడబోనన్నారు. అన్నిటికీ మించి తాను, తన మంత్రులు కేంద్రం చేతిలో కీలుబొమ్మలం కామనీ, తమ రాష్ట్ర పౌరులకు ఏం కావాలో తమకు బాగా తెలుసనీ ప్రగల్భాలు పలుకుతున్నారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమనీ, ఎవరో ఏదో చెపితే దాన్ని అనుసరిస్తూ పోవడం కుదరదని తెగేసి చెప్పారు. ఆయన మాటల్లో ఉన్న తెగువ చేతల్లో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాశ్మీర్ పౌరుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహమే ఇందుకు నిదర్శనం. గతంలో పరాయి దేశాల మిలిటెంట్లు భద్రతా బలగాలపై దాడులకు తెగబడితే.. ఇపుడు స్వయంగా స్వరాష్ట్ర పౌరులే ఈ పని చేస్తున్నారు.
ఒకవైపు వీటిని అణిచివేయలేక.. మరోవైపు భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనివ్వలేక ఒమర్ సతమతమవుతున్నారు. అదేసమయంలో ఒమర్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నందు వల్ల.. కేంద్రంలో ఈ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చోద్యం చూస్తూ సమస్యను సాగదీస్తోంది. దీని ఫలితమే ఓమర్ నోటి వెంట కాశ్మీర్ ఓ అంతర్జాతీయ సమస్యంటూ వ్యాఖ్యలు రావడానికి సాక్షీభూతం.