బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని ఈపూరుపాలెంలో జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. శుక్రవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేసారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అనంతరం బాధితురాలి తలపై రాయితో కొట్టి హతమార్చారు.
ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరించారు. ఆరోజు వేకువజామున యువతి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే గంజాయి, మద్యం తాగుతూ వున్న నిందితులు యువతిని గమనించి ఆమెను పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమె తలపై రాయితో మోది హత్య చేసారు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తమ దుస్తులపై మరకలు పడటంతో దుస్తులు మార్చుకుని తిరిగి ఏమీ ఎరగనట్లు స్థానికులతో పాటు వీరు కూడా కలిసి వచ్చారు. ఐతే వారిపై ఇంతకుముందే క్రిమినల్ కేసులు వుండటంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా వుంచారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవం బయటకు వచ్చింది.