పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై బాలీవుడ్ సినీ నటి ప్రీతి జింటా నిజాలను బయటపెట్టారు. గతంలో కాలే సిగరెట్లు తన ముఖంపై విసిరారని, గదిలో పెట్టి బంధించారని నెస్ వాడియాపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన సినీనటి ప్రీతీ జింతా ఆరోపించారు. మే 30న ముంబయి వాంఖడే స్టేడియంలో తనపై ఆయన దాడికి ముందే ఈ సంఘటనలు జరిగాయని చెప్పారు.
విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరేందుకు జూన్ 30న ముంబయి పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాను కలిసిన సందర్భంగా ఆయనకు అందజేసిన ఒక లేఖలో ప్రీతి ఈ ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడని తెలిపారు. తనను చంపేస్తాడేమోనని ఆందోళన చెందానన్నారు.
అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యానని ప్రీతిజింటా చెప్పింది. ప్రతీ జింతా మాట్లాడుతూ... ''నా పట్ల నెస్ వాడియా ప్రవర్తన హింసాత్మకంగా మారుతూ వచ్చింది. కాలే సిగరెట్లు నా ముఖంపై విసరడం, నన్ను గదిలో పెట్టి బంధించడం, చేయిచేసుకోవడం లాంటివి జరిగాయి. ఆయన్ను నాకు దూరంగా ఉంచాలని కోరుకొంటున్నా. అప్పుడు నేను మనశ్శాంతితో ఉండగలను. లేదంటే ఏదో ఒక దురదృష్టకరమైన రోజు ఆయన ఆగ్రహోద్రేకంతో నన్ను చంపేస్తారు. ఈ ఆందోళన నన్ను భయపెడుతోంది'' అని లేఖలో ఆమె పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి వెల్లడించారు.
వేధింపుల కేసు విషయమై తన మాజీ ప్రియుడు నెస్ వాడియాతో కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధంగా లేరట. ఎవరెన్ని సార్లు కాంప్రమైజ్ చేసినా ప్రీతి జింటా మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.