భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ లండన్లో ఓ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మాంచెస్టర్ నుంచి లండన్కు ఆదివారం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గవాస్కర్ ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో గవాస్కర్తో పాటు ఆయన మిత్రుడు చంద్రేష్ పటేల్, క్రికెట్ వ్యాఖ్యాత మార్క్ నికోలస్ కూడా ఉన్నారు. సన్నీ తదితరులు వెనుక సీట్లో కూర్చుని ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో వారు ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు దెబ్బతింది. అదృష్టవశాత్తూ సన్నీతో సహా ఎవరికీ గాయాలు కాలేదు.
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ "మై గాడ్! మమ్మల్ని దేవుడే రక్షించాడు. ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది. పైగా, డ్రైవర్ కారును వేగంగా నడుపుతున్నాడు. అంత ప్రమాదం జరిగినా ఎవరూ గాయపడలేదు. ఏమైనా, అది చాలా భయానకం!" అని తెలిపారు. కాగా, ప్రమాదం తర్వాత వారు ఆ కారును వదిలేసి ఈస్ట్ మిడ్ ల్యాండ్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి, అక్కడో ట్రైన్ పట్టుకుని లండన్ చేరుకున్నారు. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు గవాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.