భారత్కు మరో అగ్ని పరీక్ష మొదలైనట్టే కనిపిస్తోంది. గౌతం గంభీర్ డకౌట్ కావడంతో భారత్కు కష్టాలు తప్పేలా లేవు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ ఏస్ ఫాస్ట్ బౌలర్ జిమ్మీ ఆండర్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు.
టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ (0) ఆండర్సన్ విసిరిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతికి వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. ఆడదామా? వదిలేయాలా? అన్న సందిగ్దంలోనే గౌతీ బ్యాట్ ముందుకు జరపడంతో బంతి సుతారంగా రాసుకుంటూ వెళ్ళి కీపర్ గ్లోవ్స్లో వాలింది.
ఇక, ఆశాకిరణం పుజారా (4) సైతం స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. బ్రాడ్కు ఈ వికెట్ దక్కింది. ఈ పొడగరి పేసర్ విసిరిన బంతి పుజారా బ్యాట్, ప్యాడ్కు మధ్య ఖాళీలోంచి వెళ్ళి బెయిల్స్ను ఎగరగొట్టింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్లకు 12 పరుగులు కాగా, ఓపెనర్ మురళీ విజయ్ (8*) జతగా, విరాట్ కోహ్లీ (0*) క్రీజులో ఉన్నాడు.