భారత ఉపఖండంలో జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్లో టీమిండియా గెలుపును టాస్ మరియు బ్యాటింగ్ ఫామ్ వంటి అంశాలే నిర్ధేశిస్తాయని భారత్కు 1983లో వన్డే ప్రపంచకప్ సాధించిపెట్టిన మాజీ క్రికెట్ లెజండ్, కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
" మనదేశ క్రికెట్ జట్టుకు బ్యాటింగే బలం. ఈ బ్యాటింగ్కు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తోడుకావాలి. అలాగే అదృష్టం కూడా ఒకవైపు ఉంది. ఎలాగంటే ప్రతి మ్యాచ్లోనూ టాస్ గెలవడం ముఖ్యం. ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచి భారీ స్కోరు సాధిస్తే, విజయలక్ష్యాన్ని చేధించడం కఠినమవుతుంది" అని కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కానీ మన జట్టు టాస్ గెలిచి 300 పరుగుల పైచిలుకు సాధిస్తే బౌలర్లు మ్యాచ్ను గెలిపిస్తారని కపిల్ దేవ్ తెలిపాడు. ఇంకా ఆల్రౌండర్లు అంటూ ప్రత్యేకంగా అవసరం లేదు. ధోనీ కూడా ఒక వికెట్ కీపింగ్ ఆల్రౌండరేనని కపిల్ అన్నాడు.
ధోనీ తన సమర్థవంతమైన కెప్టెన్సీతో అద్భుతంగా ఆడి, వన్డే ప్రపంచకప్ను సాధించిపెడుతాడని ఆశిస్తున్నట్లు కపిల్ తెలిపాడు. టీమిండియాలో కప్ను సాధించిపెట్టే ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఫీల్డింగ్, స్కోర్ చేయడంలో కొన్ని బలహీనతలు ఉన్నాయని కపిల్ తెలిపాడు.