ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఐదు టెస్ట్ల సాంప్రదాయ యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. క్లార్క్ (103), నార్త్ (96) చివరి రోజు రాణించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది.
మైఖేల్ క్లార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. చివరి రోజు 88/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్- మైకేల్ హసీలు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వాట్సన్ (52) ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అండర్సన్ బౌలింగ్లో ప్రియర్కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ పెవీలియన్ దారిపట్టాడు. లంచ్ విరామానికి కాస్త ముందు హసీ (64) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్లార్క్- నార్త్ ద్వయం ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.
చివరి సెషన్లో నార్త్ భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో నార్త్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐదో వికెట్కు వీరిద్దరూ 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం ఆస్ట్రేలియా వైస్కెప్టెన్ క్లార్క్ ఈ సిరీస్లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. 50వ టెస్ట్ ఆడుతున్న క్లార్క్కు ఇది 12 సెంచరీ కాగా, ఇంగ్లాండ్పై నాలుగో సెంచరీ. మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రా చేసుకునేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించి గంట ముందుగానే ఆట నిలిపివేశారు. యాషెస్ నాలుగో టెస్ట్ లీడ్స్లో ఆగస్టు 7న ప్రారంభం కానుంది.