ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఆడే ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్లు తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సచిన్, భజ్జీలతో పాటు మలింగా, పోలార్డ్లు సైతం ముంబై ఇండియన్స్ జట్టులో యధావిథిగా కొనసాగుతారు.
ఐపీఎల్ నాలుగో సీజన్ కోసం ఆడే క్రికెటర్ల కోసం వేలం పాట జరుగనున్న నేపథ్యంలో, ఆయా యాజమాన్యాలు తమ మాజీ క్రికెటర్లను జట్టులోనే పదిలం చేసుకునేందుకు సన్నాహాలు మొదలెట్టాయి. ఈ క్రమంలో తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను అదే జట్టులో కొనసాగించేందుకు బీసీసీఐ గడువు విధించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇద్దరు విదేశీ ఆటగాళ్ల స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.
దీంతో కెప్టెన్ సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, మలింగా, పోలార్డ్లు ఐపీఎల్-4లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతారని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా షేన్ వార్న్, షేన్ వాట్సన్ల కాంట్రాక్టును పొడిగించింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ తరపున వీరిద్దరూ ఐపీఎల్ నాలుగో సీజన్ బరిలోకి దిగనున్నారు.