భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. కివీస్లోని నేపియర్లో ఉన్న మెక్లీన్ పార్క్ మైదానంలో భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అంతకుముందు, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా బరిలోకిదిగిన సెహ్వాగ్, టెండూల్కర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 19 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్, ఐదు ఫోర్లతో 23 పరుగులతోనూ, ,సచిన్ మూడు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడింది. దీంతో మ్యాచ్ను నిలిపి వేశారు. అప్పటికి భారత్ స్కోరు 4.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.
అంతకుముందు భారత తుది జట్టులో సెహ్వాగ్, సచిన్, గంభీర్, రైనా, యువరాజ్ సింగ్, ధోనీ, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్లకు చోటు కల్పించారు. అలాగే కివీస్ తుది జట్టులోకి రైడర్, మెక్కల్లమ్, గుప్తిల్, టేలర్, ఎలియట్, బ్రూమ్, ఓరమ్, వెట్టోరి, బుట్లర్, ఓబ్రియెన్, మిల్స్లు ఎంపికయ్యారు.