భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ట్వంటీ-20 మ్యాచ్ జరుగనుంది. రెండు ట్వంటీ-20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి ట్వంటీ-20 మ్యాచ్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ సముద్రతీరంలో ఉన్న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రెండు రోజుల క్రితమే విశాఖకు చేరుకున్న విషయం తెల్సిందే.
ఈ ట్వంటీ-20 సిరీస్కు ముందు.. టెస్టు సిరీస్ను విజయవంతంగా క్లీన్స్వీప్ చేసిన టీమిండియా... ధనాధన్ క్రికెట్కు సిద్దమైంది. రెండు మ్యాచ్లో టీ-ట్వంటీ సిరీస్కు ధోనిసేన సమాయత్తమైంది. శ్రీలంక వేదికగా ఈనెలలో జరుగనున్న పొట్టి క్రికెట్ ప్రపంచ కప్కు ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో దీనికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.
లంకలో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలంటే... స్వదేశంలో జరుగుతోన్న ఈ సిరీస్లో ధోని గ్యాంగ్ విజయం సాధించి తీరాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్ శుక్రవారం జరుగుతుండగా, రెండో మ్యాచ్ ఈనెల 11వ తేదీ చెన్నయ్లోని చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇకపోతే.. ట్వంటీ-20 రికార్డుల పరంగా చూస్తే.. ఇండియాపై న్యూజీలాండ్దే పైచేయిగా ఉంది. కివీస్ టీమ్తో భారత్ మూడుసార్లు తలపడగా... అన్నింటిలోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఈ సారి స్వదేశంలో జరుగనుండటం ధోనీ సేనకు అడ్వాంటేజ్. టెస్టు సిరీస్ నెగ్గిన ఊపులోనే ట్వంటీ-20లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.