ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సిరీస్లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టులోని ఏడుగురు సభ్యులు ఆసీస్కు ప్రయాణమయ్యారు. ఆస్ట్రేలియాలో ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టులోని ఏడుగురు సభ్యులు అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు వీలుగా జట్టులోని మిగిలిన సహచరుల కంటే ముందుగానే ఆసీస్కు పయనమయ్యారు.
‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్మన్ వివిఎస్.లక్ష్మణ్లతో పాటు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, పేసర్లు ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్టాండ్బై వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలు ఆసీస్కు వెళ్లిన సభ్యుల్లో ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జట్టులోని మిగిలిన సభ్యులు ఈ నెల 12వ తేదీన చైన్నై నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఆస్ట్రేలియాతో ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు టెస్టుల సిరీస్తో పాటు రెండు ట్వంటీ-20 మ్యాచ్లు ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో కలిసి ముక్కోణపు వన్డే సిరీస్లో ఆడనుంది.