ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 టోర్నీ ఆరంభ మ్యాచ్లో కేప్ కోబ్రాస్ చేతిలో ఓడిపోవడానికి చెత్త ఫీల్డింగే ప్రధాన కారణమని రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. ఈ మ్యాచ్లో ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన విషయం తెల్సిందే.
మ్యాచ్ అనంతరం అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. కేప్ కోబ్రాస్ బ్యాట్స్మెన్ డుమ్నీ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆరు మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ అందించే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లో డుమ్నీ 52 బంతుల్లో 99 (నాటౌట్) పరుగులు చేసి కోబ్రాస్ జట్టును ఒంటి చేత్తో గెలించిన తీరు అద్భుతమన్నాడు.
స్కోరు బోర్డుపై 180 పరుగులు ఉంచినప్పటికీ.. మ్యాచ్లో ఓడిపోవడం చాలా నిరాశకు గురి చేస్తుందన్నాడు. ఈ మ్యాచ్లో డుమ్నీ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉందన్నాడు. ముఖ్యంగా, తమ ఫీల్డర్లు అనేక క్యాచ్లను వదిలివేయడం కూడా ఒక కారణమన్నారు.
ఈ పిచ్పై బాలు చాలా వేగంగా బ్యాట్కు వస్తుందని, అందువల్ల మెల్లగా స్పిన్కు అనుకూలిస్తుందని తాము భావించామన్నారు. అయితే, డుమ్నీ అద్భుత పోరాటపటిమ కనపరిచి జట్టుకు విజయాన్ని అందించాడని కుంబ్లే అన్నాడు.