ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఆడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి నాయకత్వం వహించనున్నారు. ఐపీఎల్ నాలుగో అంచెల పోటీలు ఏప్రిల్ 8వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు వెట్టోరి కెప్టెన్సీ సారథ్యం వహించబోతున్నారని జట్టు యాజమాన్యం ప్రకటించింది.
తద్వారా ఛాలెంజర్స్ జట్టుకు రెండు పర్యాయాలు కెప్టెన్గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే స్థానంలో వెట్టోరి సారథ్య పగ్గాలు చేపట్టనున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కుంబ్లే చీఫ్ మెంటర్గా వ్యవహరించనున్నట్లు జట్టు యజమాని విజయ్ మాల్యా వ్యక్తం చేశారు.
మరోవైపు ఐపీఎల్ నాలుగో సీజన్లో బరిలోకి దిగనున్న హైదరాబాదీ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు కుమార సంగక్కర కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ 'పూమా' వరుసగా మూడో ఏడాది డెక్కన్ ఛార్జర్స్కి అధికారిక అపెరల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది.