ఎట్టకేలకు బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ సేన సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా.. శనివారం రాత్రి జరిగిన 53వ లీగ్ మ్యాచ్లో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్కు బెంగాల్ దాదా షాకిచ్చింది.
కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో షేన్ వార్న్ సేనపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు సాధించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) మాత్రమే ఒంటి చేత్తో జట్టును నడిపించాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో రాజస్థాన్ 132 పరుగులు మాత్రమే సాధించగలిగింది.
133 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన నైట్రైడర్స్ సునాయాసంగా విజయలక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ గంగూలీ (75 నాటౌట్: 50 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు), చటేశ్వర్ పుజారా (45 నాటౌట్: 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు మూడో వికెట్కు 111 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో కేకేఆర్ మరో 23 బంతులు మిగిలివుండగానే రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులను సాధించింది.
ఈ విజయంతో దాదాసేన సెమీస్ అవకాశాన్ని సజీవంగా నిలుపుకొంది. ఇక మిగిలివున్న ఒక్క మ్యాచ్లో కేకేఆర్.. ముంబై ఇండియన్స్పై నెగ్గితే సెమీస్లోకి ప్రవేశించినట్లవుతుంది. ఇకపోతే.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన 54వ లీగ్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.