ఐపీఎల్ రెండో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన హవాను కొనసాగిస్తోంది. శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో చెన్నై 13 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
హేడెన్ ఫామ్, బద్రినాథ్ జోరుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్కు ఓటమి తప్పలేదు. హేడెన్ (44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక్క సిక్స్తో 48 పరుగులు) చేసి అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో కింగ్స్ బ్యాట్స్మన్ బద్రినాథ్ (41 బంతుల్లో 9 ఫోర్లు, ఒక్క సిక్స్తో 59 పరుగులు) అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అజేయమైన అర్ధసెంచరీతో తుది దాకా ఓ మెరుపు మెరిసిన బద్రినాధ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే, 3 వికెట్ల నష్టానికి చేధించి విజేతగా నిలిచింది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మిత్ (30), నామన్ ఓజా (0) శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఐపీఎల్లో విశేషంగా రాణిస్తున్న నామన్కు ఈ మ్యాచ్లో తొలి ఓవర్లోనే చుక్కెదురైంది. మొర్కెల్ బంతికి నామన్ డకౌటై వెనుదిరిగాడు.
ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మురళీ ధరన్, జకాతి రెండేసి వికెట్లు పడగొట్టగా, మొర్కెల్, టియాగిలు చెరో వికెట్ సాధించారు. రాయల్స్ బౌలర్లలో సింగ్, త్రివేది, జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు.