ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీకు షాక్ తగిలింది. ఐపీఎల్ నాలుగో అంచెలో మళ్లీ సొంత జట్లకే ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు ఎవరెవరన్న విషయం తేలిపోయింది. ఊహించినట్లే ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను కొనసాగించగా, మరికొన్ని ఫ్రాంచైజీలు దిగ్గజ ఆటగాళ్లతో పాటు ఏకంగా కెప్టెన్లనే వేలానికి ఉంచాయి.
ఈ క్రమంలో గంగూలీ, కుంబ్లే, ద్రావిడ్, లక్ష్మణ్, ఢిల్లీ ఓపెనర్ గంభీర్, భారత పేసర్ జహీర్ వంటి దిగ్గజాలకు ఆయా జట్ల యాజమాన్యాలు షాకిచ్చాయి. గత సీజన్లో రాణించినా వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్న ద్రావిడ్కు ఉద్వాసన పలికేందుకు బెంగళూరు నిశ్చయించుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్న యువ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఆ జట్టు ఓటేసింది.
అలాగే కోల్కత్తా నైట్రైడర్స్ బెంగాల్ దాదా క్రికెటర్ గంగూలీకి ఉద్వాసన పలికింది. వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ను మాత్రమే జట్టులో కొనసాగించాలని కేకేఆర్ నిర్ణయించింది. మరోవైపు రెండో సీజన్లో ఊహించని రీతిలో విజేతగా నిలిచిన డెక్కన్ చార్జర్స్.. తన సారథి గిల్క్రిస్ట్కు ఝలక్ ఇచ్చింది. గిల్లీతో పాటు రోహిత్ శర్మ, లక్ష్మణ్ను వదిలించుకోవాలని చార్జర్స్ నిర్ణయించింది.
అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ సెహ్వాగ్ను మాత్రమే జట్టులో ఉంచుకుంది. ఊహించని విధంగా గంభీర్ను సైతం వేలానికి ఉంచింది. ఇంకా ఐపీఎల్ మూడో సీజన్లో జట్టున గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ఆ జట్టు యాజమాన్యం అప్పగించింది. ధోనీతో పాటు మురళీ విజయ్, సురేశ్ రైనా, అల్బీ మోర్కెల్లు చెన్నై సూపర్ కింగ్స్లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.