ఏడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతిలో జరుగుతున్న ఆరో వన్డేలో భారత జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముంగిట 171 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ ధోనీకి ఆసీస్ బౌలర్లు సరైన గుణపాఠం నేర్పించారు. నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్మెన్స్ను ముప్ప తిప్పలు పెట్టారు. ఆసీస్ బౌలర్లు జాన్సన్, బోలింగర్, షేన్ వాట్సన్లు అద్భుతమైన బంతులతో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ను చెల్లాచెదురు చేశారు.
అయితే, మ్యాచ్ ఆఖర్లో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (57), ప్రవీణ్ కుమార్ (54 నాటౌట్) పుణ్యమాని ధోనీ 170 పరుగులైనా చేయగలిగింది. జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్లు కాగా, సెహ్వాగ్ (6), యువరాజ్ (6), సచిన్ (10), ధోనీ (24)లు మరోమారు పేలవమైన ప్రదర్శన చూపారు.
ఫలితంగా "టీమ్ ఇండియా" భారీ మూల్యాన్నే చెల్లించుకోనుంది. భారత జట్టు ఉంచిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ చేధిస్తే వన్డే సిరీస్ను 4-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈనెల 11వ తేదీన ముంబైలో జరిగే వన్డే నామమాత్రంగానే మిగలనుంది.
లేదంటే బౌలర్లు, ఫీల్డర్లు ఏదైనా అద్భుతం, మాయ చేసి ఆసీస్ను ఓడిస్తే ఏడో వన్డే సిరీస్ ఫలితాన్ని శాసించే మ్యాచ్గా మిగులుతుంది. కాగా, ఆస్ట్రేలియా జట్టులో బోలింగర్ ఐదు, జాన్సన్ మూడు వాట్సన్ రెండు చొప్పున వికెట్లు తీశారు. కాగా, ప్రవీణ్ కుమార్ వన్డేలో తొలి అర్థ సెంచరీని చేయగా, మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అర్థ సెంచరీతో ఆదుకున్నాడు.