ఐపీఎల్ లీగ్లో భాగంగా చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చైన్నై జట్టు రాజస్థాన్పై 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై జట్టు ఉంచిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేధించడంలో విఫలమైన రాజస్థాన్ 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై ఓపెనర్లు మైక్ హసి, మురళీ విజయ్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. హస్సీ 30 బంతుల్లో 46 పరుగులు చేయగా, విజయ్ 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని కొనసాగించిన వన్డౌన్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా, కెప్టెన్ ధోనీలు అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. రైనా 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ధోనీ కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ను అశ్విన్, బొలింగర్లు దెబ్బతీశారు. షేన్ వాట్సన్ 11 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ ద్రవిడ్ని బొలింజర్ పెవిలియన్కి పట్టించాడు. వన్డౌన్ బ్యాట్స్మెన్ రహానే ఒక్కడే మెరుగ్గా రాణించి 52 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో రాజస్థాన్ 19.3 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. మురళీ విజయ్కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.