సిడ్నీ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ మ్యాచ్కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక.
శనివారం సిడ్నీకి చేరుకున్న ధోనీ సేన ఆదివారం జిమ్లో గడిపింది. ఆటగాళ్లు ఫిట్నెస్ కోసం పలు రకాల కసరత్తులు చేశారు. ఇక, సోమవారం సిడ్నీ మైదానంలో నెట్ ప్రాక్టీసు చేశారు. ఉదయం ఫుట్ బాల్ ఆడారు. అనంతరం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ నెట్స్లో చెమటలు కక్కేలా ప్రాక్టీసు చేశారు.
డాషింగ్ ఓపెనర్ రోహిత్... స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతో బంతులు వేయించుకుని సాధన చేయగా, కోహ్లీ, ధావన్ పేస్ను ఎదుర్కొనేందుకు మొగ్గుచూపారు. అందరిలోకి కోహ్లీ ఎక్కువ సేపు నెట్స్ లో గడిపాడు. కోహ్లీ... పాకిస్థాన్తో మ్యాచ్ మినహా భారీ స్కోర్లు సాధించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఈ విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఈ ఢిల్లీ యువకెరటం దృఢనిశ్చయంతో ఉన్నాడు. కాగా, సిడ్నీ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దీంతో, అశ్విన్ - జడేజా జోడీ కీలకం కానుంది.