ఆదివారం గుజరాత్ లయన్స్ చేతిలో పరాజయం పాలవడాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోవడం ఎంతో బాధను మిగిల్చిందన్నాడు. ఇంకా ఐపీఎల్లో తొలి శతకాన్ని నమోదు చేసుకోవడం కూడా సంతోషాన్నివ్వలేదని తెలిపాడు.
జట్టు స్కోరు 170 కావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఏ దశలోనూ సెంచరీ గురించి ఆలోచించట్లేదని చెప్పుకొచ్చారు. కానీ జట్టు ఓడిపోవడం గురించి ఆలోచించనే లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ (100 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 1×6) కెరీర్లో తొలి టీ20 సెంచరీ చేసినా అది వృధా అయిన సంగతి తెలిసిందే.
గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. విరాట్ కోహ్లీ శతకంతో అదరగొట్టినా గుజరాత్ లయన్స్ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆదివారం మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 180/2 స్కోరు చేసింది. కాగా, దినేశ్ కార్తీక్ (50 నాటౌట్; 39 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్తో గుజరాత్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.