దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15,000 మందిని నియమించనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు 15,000 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో తమ బ్యాంకుకు చెందిన పలు సేవలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని బ్యాంక్ ఆ ప్రకటనలో వివరించింది.
ప్రతి గ్రామంలోను బ్యాంకు తన శాఖలను ప్రారంభించేందుకు వీలుకాదని, కాబట్టి బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్ మోడల్లు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు తమ బ్యాంకు సౌకర్యాలు, సేవల గురించి వివరించేందుకు ఉపయోగపడతారని ఆ ప్రకటనలో తెలిపింది.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు బిజినెస్ కరస్పాండెంట్లు దోహదపడతారని, అలాగే బ్యాంకు లావాదేవీల్లోను వీరు సహాయపడతారని ఆ ప్రకటన తెలిపింది.