ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు తమ ఖాతాదారుల కోసం తొలిసారి క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఈ బ్యాంకుకు కేవలం డెబిట్ కార్డు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఎస్.బి.ఐ కార్డు సహకారంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. మంగళవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కార్డును ఎస్.బి.ఐ కార్డు సీఈఓ విజయ్ జషువా, లక్ష్మీ విలాస్ బ్యాంకు సీఓఓ (క్రెడిట్ కార్డు) విద్యాసాగర్లు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారిద్దరు విలేకరులతో మాట్లాడుతూ ఎస్.బి.ఐ కార్డుతో కలిసి లక్ష్మీ విలాస్ బ్యాంకు కో-బ్రాండెట్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ కార్డును రెండు రకాలుగా ప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి వీసా ప్లాటినం కార్డు కాగా, మరొకటి వీసా సింప్లీ సేవ్ కార్డు అని చెప్పారు. ఈ కార్డుల ద్వారా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్డులను చిప్ బేస్డ్గా తయారు చేసి హై సెక్యూరిటీ టిప్స్తో రూపొందించినట్టు తెలిపారు. సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ రూ.2 లక్షలు కాగా, ప్లాటినం కార్డు క్రెడిట్ లిమిట్ రూ.5 లక్షలుగా నిర్ణయించినట్టు వివరించారు.
ఈ కార్డులు ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్ ఔట్లెట్లలోనూ, భారత్లో సుమారుగా 2.85 లక్షల ఔట్ లెట్లలో అనుమతిస్తారని తెలిపారు. ఈ కార్డు కలిగిన వినియోగదారులు ఫ్యూయల్ సర్చార్జి, నగదు విత్డ్రా, బిల్ పే ఫెసిలిటీ, ఫ్లెక్సీ పే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్, రివార్డ్ పాయింట్స్ తదితర ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి తమ బ్యాంకు ఖాతాదారులకు పదివేల క్రెడిట్ కార్డులను జారీ చేస్తామనే ఆశాభావాన్ని విద్యాసాగర్ వెల్లడించారు. కాగా, ఎస్.బి.ఐ క్రెడిట్ కార్డులు 3.2 మిలియన్లు ఉండగా, ప్రతి యేడాది ఆరు లక్షల కార్డులను జారీ చేస్తున్నట్టు చెప్పారు.