కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకుల లావా దేవీల పన్నును (సీటీటీ) రద్దు చేయడం అత్యంత ప్రమాదకరమని, దీంతో ఆహార ఉత్పత్తులతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ద్రవ్యోల్బణం 10శాతంపైగా ఉన్నప్పటికీ రిటైల్ మార్కెట్లో బియ్యం, నూనెలు, పప్పు, చక్కెర తదితర ధరలు భగ్గున మండుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచానా వేస్తున్నారు.
పెట్రోల్, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువుల ధరల భవిష్యత్ మార్కెట్ స్పెక్యులేషన్ వల్లే పరుగులెడుతున్నాయని నిపుణులు బెంబేలెత్తుతున్నారు.
తాజాగా కేంద్రం బడ్జెట్లో సీటీటీ పన్నును రద్దు చేయడంతో భవిష్యత్ మార్కెట్ లావాదేవీలు మరింత పుంజుకోనున్నాయి. దీంతో ఆమేరకు సమస్యలు కూడా పెరుగుతాయని, ఇది కార్పోరేట్ వర్గాలకు లాభం చేకూర్చే విషయమని, అదే సందర్బంలో సామాన్యుడికి మాత్రం ఆర్థికంగా భారం మోపే లాంటిదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు.