గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ అందించిన నివేదకను అమలు చేస్తామని, ఇందులో భాగంగా పారిఖ్ కమిటీ సూచన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఎక్సైజ్ సుంకుం రెండు శాతం పెంచడంతో ఈ పెరుగుదల నేటి నుంచే అమలు కానుంది.
పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచేందుకు సిద్ధంగానున్నట్లు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రకటించడంతోపాటు పారిఖ్ కమిటీ అందించిన నివేదికను తాము అమలు చేస్తున్నామన్నారు. దీంతో విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. పెట్రో ధరల పెంపుపై సభలో గందరగోళం చెలరేగింది.
ఇదిలావుండగా కిరీట్ పారిఖ్ కమిటీ సూచన మేరకు ఎక్సైజ్ సుంకం పెంపు నేటి నుంచే అమలులోకి రానుంది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రతి లీటరుకు దాదాపు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఎక్సైజ్ సుంకాన్ని రెండు శాతం మేరకు పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. పెట్రోలు, డీజిల్తోపాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగనున్నాయి. సిగరెట్లు, మద్యం, సిమెంట్ ధరలు కూడా పెరుగుతాయి. అలాగే లగ్జరీ కార్లపై ఎక్సైజ్ సుంకం దాదాపు 22 శాతం పెరిగింది. ఈ పెరుగుదల ఈ రోజునుంచే అమలులోకి వస్తుంది.