శ్రీపర్వతా.. విజయపురి... నాగార్జునకొండ... ఇలా ఏ పేరును చెప్పినా మనకు గుర్తుకువచ్చేది నాగార్జునసాగర్. ఓ అధ్భుతమైన నిర్మాణంగా చరిత్రకెక్కిన సాగర్ కృష్ణా నదిపై వ్యవసాయ అవసరాల కోసం నిర్మించిబడింది.
రాష్ట్రరాజధాని హైదరాబాద్ నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న సాగర్ తూర్పు కనుమలలోని నల్లమల అటవీ ప్రాంతంలో మధ్య లోయగా భాసిల్లుతోంది. కొన్నివేల సంవత్సరాల క్రిందటి నాగరికతలకు అద్దంపట్టేలా ఈ ప్రాంతం ఉంటుంది. తొలుత ఈ ప్రాంతంలో శాతవాహనులు ఉండగా, మూడో శతాబ్దంలో ఇక్ష్వాకులకు నిలయంగా మారింది.
రాతి యుగం నుంచి మధ్యరాతియుగం వరకూ... అంటే క్రీస్తు పూర్వం మూడువేల నుంచి 1500 శతాబ్దం వరకూ కృష్ణా బేసిన్ ప్రజలతో అలరారుతుండేదని పురావస్తుశాఖ వారు తెలిపారు. 124 మీటర్ల ఎత్తుతోనూ, 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో 380 చదరపు కి.మీ మేర నీరు విస్తరించి ఉంటుంది.
సాగర్ కుడి వైపు ఉన్న జవహర్లాల్, ఎడమ వైపు ఉన్న లాల్ బహదూర్ కాలువలు కోస్తా, తెలంగాణా ప్రాంతాలకు నీటిని అందిస్తాయి. హైడ్రో విద్యుత్ ప్రాజెక్ట్ కింద కాలువ విస్తీర్ణం సుమారు 40వేల కి.మీ మేర ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ను ఆధునిక దేవాలయంగా సంబోధించేవారట. బౌద్ధ ప్రచారకుడు ఆచార్య నాగార్జున తతాగత తత్వాన్ని బోధించిన ప్రాంతం శ్రీపర్వత, విజయపురిలు.
ఇంకా ముఖ్య ప్రాంతాలైన నాగార్జునకొండ, ఎత్తిపోతల, పులుల శాంక్చరీల గురించి వచ్చే వారం తెలుసుకుందాం...