తిరుపతిలో ఒక వివాహిత కిడ్నాప్కు గురైంది. రేణిగుంట రోడ్డు కాటన్ మిల్లుకు చెందిన ప్రసన్న కుమార్కు, అదే ప్రాంతానికి చెందిన తేజశ్రీకి 2015 అక్టోబర్ 20వ తేదీ వివాహమైంది. ఇంట్లో వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేకుండానే ప్రసన్నకుమార్ తన కుటుంబాన్ని బెంగుళూరులో ఉంచాడు.
అయితే ఈ నెల 18వ తేదీ తన కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళివస్తానని తేజశ్రీ తిరుపతికి వచ్చింది. ఆ తరువాత నుంచి తనకు కనిపించలేదంటూ ప్రసన్నకుమార్ తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రసన్నకుమార్. అయితే తేజశ్రీని ఆమె తల్లిదండ్రులే కనిపించకుండా చేశారని కూడా ఫిర్యాదులో ప్రసన్న కుమార్ పేర్కొన్నాడు. తిరుపతి ఈస్టు పోలీసులు ఫిర్యాదు ఆధారంగా యువతి కోసం గాలిస్తున్నారు.