పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే రామారావు కూడా వున్నారు. డ్రైవర్, క్లీనర్తో కలిపి పన్నెండు మందితో హైదరాబాద్ వస్తున్న వోల్వో కొండ్రపోలు దగ్గరకు రాగానే లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
గత వారంలో పాలెంలో ఒక వోల్వో బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. కాగా ఓల్వో బస్సుల డిజైన్లోనే లోపం వుందని విమర్శలు వచ్చినప్పటికీ, ఓల్వో సంస్థ మాత్రం తాము రూపొందించే బస్సులు భేషుగ్గా వున్నాయని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంది.