పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయడమేకాకుండా, ఆ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేసి తీరుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు.
ఇదే అంశంపై ఆమె గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆర్థికపరమైన అంశాల పట్ల ఆర్థికశాఖతో జలవనరుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందన్నారు. 70:30 శాతం నిధుల నిష్పత్తిపై ఆర్థిక శాఖకు, ప్రధాని కార్యాలయానికి వివరణ ఇచ్చామన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామన్నారు.
మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిషా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా అని ప్రశ్నించగా, ఈ మాట నిజమే అయినప్పటికీ.. ఇప్పటికే ఆ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని అన్నీ వివరించామన్నారు. మరోసారి వారిని పిలిచి మాట్లాడతామని కూడా ఆమె చెప్పారు.
అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విభజన చట్టం మేరకు పోలవరాన్ని కేంద్రం పూర్తి చేసి తీరుతుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందన్నారు.