మీడియా నన్ను వ్యతిరేకిస్తుందా.. ఫైబర్ గ్రిడ్తో కొడతానంటున్న బాబు ప్రభుత్వం
మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాపు ఉద్యమం సమయంలో వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ప్రభుత్వాధినేత ఆక
మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాపు ఉద్యమం సమయంలో వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ప్రభుత్వాధినేత ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ఏకంగా మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. దీనిద్వారా వ్యతిరేక మీడియా ప్రసారాలు ప్రజలకు చేరకుండా అడ్డుచక్రం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంటోందా? తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను నిలిపివేయాలన్నదే ప్రభుత్వ పెద్దల యోచనా? అంటే అవునన్నదే సమాధానం. అందుకే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను పూర్తిగా అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే కట్టబెడుతున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దానికి తోడుగా ఇతరుల కేబుల్ సంస్థల రెక్కలను ప్రభుత్వం విరిచేస్తోంది. టీడీపీ నాయకుల సంస్థల వైర్లను తప్ప ఇతర సంస్థల వైర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. అంటే అవి ఇకపై ఉనికిలో కూడా లేకుండా పోతాయి. అప్పుడు పెత్తనమంతా ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల ప్రైవేట్ కేబుల్ సంస్థలదే.
ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే బాధ్యతను ప్రభుత్వం టీడీపీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే ప్రభుత్వం ఏజెన్సీల పేరిట కట్టబెడుతోంది. కర్నూలు జిల్లా కేంద్రంలో ఉపముఖ్యమంత్రి బంధువుల సంస్థకు అప్పగించారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి చెందిన కేబుల్ సంస్థకు ఏజెన్సీ దక్కింది.
రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీని దక్కించుకున్న ప్రైవేట్ కేబుల్ సంస్థలు తమ కేబుల్ వైర్ల ద్వారానే వినియోగదారులకు ఈ సేవలను అందించాల్సి ఉంటుంది.
విద్యుత్ స్తంభాలపై ఫైబర్ గ్రిడ్ కేబుల్ వైరు తప్ప ఇతర వైర్లు వేలాడకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల కేబుల్ వైర్లు మాత్రమే ఉంటాయి. ఇతరుల కేబుల్ సంస్థల వైర్లను కత్తిరించేస్తారు. అంతిమంగా ఆ సంస్థలు మూతపడక తప్పదు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి.
వైర్లను తొలగించేందుకు అవసరమైతే పోలీసు సిబ్బంది సహాయం కూడా తీసుకోవాలంటూ గతేడాది డిసెంబర్ 24న ఎస్పీడీసీఎల్ అధికారులు మెమో(217516) జారీ చేశారు. పోలీసుల సహా యం తీసుకొని మరీ తొలగించాలంటూ స్వయంగా సీఎం గతేడాది నవంబర్ 16న జరిగిన సమా వేశంలో ఆదేశాలిచ్చా రని ఈ మెమోలో స్పష్టం చేశారు. ఇకపై ఫైబర్ గ్రిడ్ మాటున అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ వైర్లు మాత్రమే విద్యుత్ స్తంభాలపై వేలాడనున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమల్లోకి రాగానే జనం తమకు నచ్చిన చానల్ చూసే అవకాశం కూడా ఉండదు. టీడీపీకి చెందిన ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే చానళ్లనే చూడాల్సి ఉంటుంది.
మొన్ననే విశాఖ పట్నంలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సందర్భంగా వైకాపా మహిళా ఎమ్మెల్యే రోజాను సదస్సులో పాల్గొనకుండా చేసిన ప్రభుత్వం ఆమె తర్వాత తీవ్ర ఆగ్రహంతో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రభావాన్ని గుర్తించి ప్రసారం అవుతుండగానే సాక్షి, వి6 తదితర చానెళ్ల ప్రసారాలాను ఆ రోజు మొత్తంగా అడ్డుకున్న వైనం తెలిసిందే. ఫైబర్ గ్రిడ్ రాకముందే వ్యతిరేక చానెళ్లను అడ్డుకోవడానికి బరితెగించిన ప్రభుత్వం ఇక ఫైబర్ గ్రిడ్ వచ్చాక మీడియాపై, ప్రసారాలపై ఎంత గుత్తాధిపత్యం వహించనున్నదో ఊహించడానికి కూడా సాధ్యం కాదని పరిశీలకుల అభిప్రాయం.