ప్రత్యేక హోదా అంశం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అన్ని పార్టీల నేతలు ఇపుడు హాట్హాట్గా చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఓ టీవీ షోలో పాల్గొన్న వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్లు బూతులు తిట్టుకున్నారు.
తాము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నామని విచక్షణను కూడా మరచిపోయి.. టీవీ చానల్ లైవ్ షోలో పాల్గొన్నామనే విషయాన్ని మరిచిపోయి.. వ్యక్తిగత దూషణలకు దిగారు. సిగ్గు లేని నేతలంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ షోలో పాల్గొన్న జలీల్ ఖాన్, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్పై వ్యక్తిగత దూషణలకు దిగారు.
వెల్లంపల్లి కూడా అంతే స్థాయిలో స్పందించారు. "సిగ్గూ, శరం లేకుండా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిపోయిన నువ్వా నన్ను విమర్శించేది? ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు కూడా నీకు లేదు" అని వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
దీనిపై జలీల్ ఖాన్ స్పందిస్తూ... "కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు నన్ననేంతటి వాడివా...?" అంటూ విరుచుకుపడ్డారు. వీరి పరస్పర దూషణలు ఏకవచన సంబోధనలతో శ్రుతిమించిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనక్కర్లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఆజ్యం పోశాయి.