ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపైనా ఈ టెలిఫోన్ సర్వే నడుస్తోంది... సీఎం పని తీరు బాగుంటే 1 నొక్కండి... అసంతృప్తిగా ఉంటే 2 నొక్కండి. ఫరవాలేదు అనుకుంటే 3 నొక్కండి అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలన్నీ హైదరాబాద్ ఎస్టీడీ కొడ్ నుంచి 040-38399999 నెంబరు నుంచి వస్తుండటం గమనార్హం.
ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే, మీరు ఎవరికి ఓటేస్తారు?... తేదేపా సర్వే?
సడన్గా మీ సెల్ ఫోన్కి ఒక కాల్ వస్తోంది.... ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే, మీరు ఎవరికి ఓటేస్తారు? తెలుగుదేశం అయితే 1 నొక్కండి. కాంగ్రెస్ అయితే 2 నొక్కండి, వైసీపీ అయితే 3 నొక్కండి. బీజేపీ అయితే 4 నొక్కండి అని. ఇది ఒక సర్వేకి సంబంధించిన కాల్ అని రికార్డ్ చేసిన మెసేజ్ వస్తోంది. ఇది ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం లోపాయికారిగా నిర్వహిస్తున్న సర్వే అని తెలుస్తోంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం అంతర్గత సర్వేలను చేయిస్తుంటారు.
లీడర్ల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. లోపాలుంటే, చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సందర్భానుసారం కొన్ని అంశాలను తీసుకుని సర్వే చేయడం ఆనవాయితీ. అందుకు సంబంధించిన టీం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆ టీంలో సీనియర్ జర్నలిస్ట్ లు, ఫ్రీలాన్సర్లు, రిటైర్డ్ అధికారులు ఉంటారు. వీరిచ్చిన సర్వేకు నిఘా విభాగాలు ఇచ్చిన నివేదికలను పోల్చుతారు. అన్ని కోణాల నుంచి సర్వేలను చేయించుకోవడం టీడీపీ తొలి నుంచి చేస్తోన్న ప్రక్రియ.
ప్రత్యేకహోదా, అమరావతి నిర్మాణం, కేంద్ర నిధులు, రాజకీయ పొత్తు..ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వే జరుగుతోంది. హైదరాబాద్ నుంచి అమరావతికి అధికారుల తరలింపు, విదేశీ టూర్లు, ఇసుక రీచ్ లు..ఇలా సందర్భానుసారం పరిపాలన మీద బేరీజు వేసుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. చివరికి కృష్ణా పుష్కరాల గురించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.
అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…అనే ఒకే అంశం మీద తెలుగుదేశానికి సర్వే చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, గియితే, ఈ పని వై.ఎస్.ఆర్.సి.పి అధినేత జగన్ చేయించుకోవాలి గాని, నిండా మెజారిటీ ఉన్న టీడీపీకి ఈ పని ఎందుకు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.