మెదక్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్యపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న మొన్న వరకు జగ్గారెడ్డి పేరు వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం మెదక్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విస్తృత మంతనాలు జరిపిన అనంతరం మెదక్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మొదట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా.. సునీతా లక్ష్మారెడ్డి వైపే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మెదక్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకుని తెలంగాణలో కాంగ్రెస్కు పునరుత్తేజం తేవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.