షిర్డీ సాయిబాబా దైవ స్వరూపమేనని పరిపూర్ణానంద స్వామి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం తెలుగు వర్శిటీలోని ఆడిటోరియంలో ప్లాన్జెరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాన్జెరి వెంకటాచలం స్మారకార్థం సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా వరదారావు కమలాకర్రావును సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ.. సాయిబాబాపై చాలా రకాలుగా మాట్లాడుకోవడం బాగాలేదన్నారు. సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపిస్తేనే ఎన్టీఆర్ను దేవుడిలా చూసిన సమాజంలో సాయిబాబాను చూస్తే తప్పేంటని పరిపూర్ణానందస్వామి అన్నారు.
సమ్మక్క, సారక్కలు దేవతలని ప్రమాణాలు ఉన్నాయా.. కట్ట మైసమ్మ దేవత అని ప్రమాణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. వారంతా మానవరూపంలోని దైవస్వరూపులని అన్నారు. కోట్లాదిమందిని ప్రభావితం చేసిన సాయిబాబా దైవస్వరూపమే అని పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు. మనిషికి జీవితంలో ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండాల్సిందేనన్నారు. భారతదేశ సంస్కృతి గొప్పదని, అందులోనూ ఇక్కడి భార్యాభర్తల బంధం దృఢమైనదని పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు.