హైదరాబాద్: ఏపీలో ఒకే ఒక్క రాజ్యసభ టిక్కెట్ అవకాశం ఉన్న వైసీపీ తన అభ్యర్థిగా విజయ సాయిరెడ్డిని ఎంపిక చేసింది. వైసీపీకి వెన్నెముకగా ఉంటూ, పార్టీ బాధ్యతలు మోస్తున్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. మ
హైదరాబాద్: ఏపీలో ఒకే ఒక్క రాజ్యసభ టిక్కెట్ అవకాశం ఉన్న వైసీపీ తన అభ్యర్థిగా విజయ సాయిరెడ్డిని ఎంపిక చేసింది. వైసీపీకి వెన్నెముకగా ఉంటూ, పార్టీ బాధ్యతలు మోస్తున్న విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. మొదటి నుంచి జగన్ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన లెక్కలు, పత్రాలను మెయింటైన్ చేసిన విజయసాయిపై జగన్ మోహన్ రెడ్డికి బాగా భరోసా ఉంది.
అందుకే పార్టీ పగ్గాలను ఇటీవల దాదాపు ఆయనకే అప్పగిస్తున్నారు. గతంలో కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబులపై ఎక్కవగా జగన్ బాధ్యతలు పెడుతుండేవారు. కానీ, క్రమేపీ వారిపై నమ్మకం తగ్గి... బాధ్యతలను తన మామ వై.వి.సుబ్బారెడ్డికి అప్పగించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు ఉంచుతున్నారు జగన్.
విజయసాయి రెడ్డి జీనియస్ అని కితాబిచ్చిన సీబీఐ
జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్గా ఉన్న విజయసాయిరెడ్డి చార్టర్డ్ అకౌంటింగ్లో దిట్ట. జగన్ మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులో సీబీఐ విజయసాయి రెడ్డిని కూడా అరెస్టు చేసింది. పలుమార్లు విచారణ చేసిన సిబిఐ... చివరికి విజయసాయి రెడ్డి జీనియస్ అని కితాబు కూడా ఇచ్చింది. సండూర్ పవర్ డైరెక్టర్గా, ఓరియంటల్ బ్యాంక్ డైరెక్టర్గా, మారిషస్ కంపెనీకి డైరెక్టర్గా విజయసాయి నడిపిన కంపెనీ వ్యవహారాలు చాలా పగడ్బందీగా ఉంటాయి. సీబిఐ వాళ్ళే ఆశ్చర్యపోయే ఆడిటింగ్ స్కిల్స్ ఉన్న విజయసాయికి రాజ్యసభ సీటు తోడైతే... ఇక ఎదురుండదని వైసీపీ భావిస్తోంది. కానీ, ఆయనను ఓడించేందుకు టీడీపీ ఇప్పటికే పావులు కదుపుతోంది. మరో 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చేస్తే... విజయసాయి అపజయం ఖాయమని టీడీపీ నేతలంటున్నారు.