అయినను పోయి రావలెను చిత్తూరుకు.. రాయబారం దిశలో చంద్రబాబు..
అంబేద్కర్ జయంతి రోజున దళిత కార్డును ప్రయోగించి మరీ తెలుగు దేశం హై కమాండ్ను దారుణంగా దెబ్బతీసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ను ఉన్నఫళాన పార్టీనుంచి బహిష్కరించాలన్నత ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు అలా చేస్తే రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వ
పిచ్చుకపై కూడా బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలో.. ఎప్పుడు ప్రయోగించకూడదో రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త ఆలస్యంగా బోధపడినట్లుంది. అంబేద్కర్ జయంతి రోజున దళిత కార్డును ప్రయోగించి మరీ తెలుగు దేశం హై కమాండ్ను దారుణంగా దెబ్బతీసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ను ఉన్నఫళాన పార్టీనుంచి బహిష్కరించాలన్నత ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు అలా చేస్తే రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భీతితో శివప్రసాద్ను బుజ్జగించడానికి తన మంత్రులను రంగంలోకి దింపారు. ఆ క్రమంలో సమస్య పరిష్కారమయ్యేంతవరకు దయచేసి మీడియాతో ఏమీ మాట్లాడవద్దని ఎంపీని అభ్యర్థించారు కూడా. మంత్రుల రాయబారం కూడా ఫలించని పక్షంలో సోమవారం ఎంపీపై తుది చర్య తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధమ్యయారని సమాచారం.
టీడీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
కానీ వారిద్దరి బుజ్జగింపులకు చిత్తూరు ఎంపీ లొంగలేదని తెలుస్తోంది. ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని శివప్రసాద్ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు స్వయంగా తిరుపతి వచ్చి ఎంపీని శాంతిపజే్స్తారని తెలుస్తోంది.
అప్పటికీ శివప్రసాద్ చల్లబడకపోతే టీడీపీతో తెగతెంపులకు సిద్దమయ్యే అలా రెబెల్ అయ్యారని రూఢిచేసుకుని ఎంపీపై బహిష్కరణ వేటుకు కూడా చంద్రబాబు మానసికంగా సిద్ధమయ్యాయరని టీడీపీ వర్గాల సమాచారం.