బండికి పెట్రోల్ కొట్టించుకోవాలంటే.. తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. లేకుంటే మీ వాహనాలకు ఇక పెట్రోల్ వేయరు. ఈ విధానం జూన్ 2వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి ఈ నిబంధనను పకడ్బందీగా అమలుచేస్తామని డీటీసీ శ్రీనివాస్ పుప్పాల తెలిపారు. ఈ నెల 24న ఆసిఫాబాద్లో, 25న మంచిర్యాలలో, 26న నిర్మల్లో, 27న ఉట్నూర్లో ఆయా పెట్రోల్ బంక్ల యజమానులతో సమావేశం కానున్నట్లు తెలియజేశారు.
సోమవారం జిల్లా కేంద్రలోని డీటీసీ కార్యాలయంలో పెట్రోల్ బంక్ యజమానులతో ఇన్ఛార్జి డీటీసీ డా.శ్రీనివాస్ పుప్పాల, ఆర్డీవో సుధాకర్రెడ్డి, డీఎస్వో ఉదయ్కుమార్, ఎంవీఐ కిషోర్చంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హెల్మెట్ ధరించి వస్తేనే పెట్రోల్ వేయాలని బంక్ యజమానులకు సూచించగా.. వారు సానుకూలంగా స్పందించారు. ప్రధానం రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషోర్ చంద్రారెడ్డి వెల్లడించారు.
దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు హెల్మెట్ నిబంధనను కఠినతరం చేస్తూ దాన్ని ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది వాహనదారులు హెల్మెట్ ధరించడంలో నిర్లక్షం వహిస్తున్నారు. దీంతో ఏటా ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే దీన్ని నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరి అని కిషోర్ వెల్లడించారు.