స్వతంత్ర భారతావనిలో ఒక్క నేర కేసు నమోదుకాని గ్రామమెక్కడుంది...?
స్వతంత్ర భారతావనిలో ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక ప్రాంతంలో అరాచకాలు, అవినీతిపరుల ఆగడాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు వంటిని జరగడం సర్వసాధారణమై పోయాయి.
స్వతంత్ర భారతావనిలో ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక ప్రాంతంలో అరాచకాలు, అవినీతిపరుల ఆగడాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు వంటిని జరగడం సర్వసాధారణమై పోయాయి. ప్రతి రోజూ ఉదయం ఇంటికి వచ్చే పేపర్లో నేరవార్తలకో ప్రత్యేక పేజీ, న్యూస్ ఛానల్స్లో క్రైమ్ బులిటెన్లు ప్రసారం చేస్తున్నాయి.
కానీ, స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క నేరం కూడా జరగని ఊరు, దారుణాలకు దూరంగా ఉన్న ఊరు ఉందంటే మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాలి. నమ్మితీరాలి. ఆ ఊరు ఎక్కడో కాదు. మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బైరిపురం అనే గ్రామం. ఈ గ్రామ ప్రజలంతా వివాదాలకు, వికృతాలకు దూరంగా ప్రశాంతంగా బతుకుతోంది. ఈ గ్రామ జనాభా కేవలం వెయ్యి మంది మాత్రమే.
చిన్న ఊరు-చింతలు లేని ఊరు అనే సామెతను నిరూపిస్తోంది. ఒకేఒక్క కేసు మాత్రమే ఈ గ్రామాన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. అది కూడా స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో. ఆ ఒక్క కేసు మినహాయిస్తే అప్పటినుంచి ఇప్పటి దాకా ప్రశాంతమైన, నేరరహిత గ్రామంగా ఈ ఊరు నిలిచిపోయింది. కేవలం అదొక్కటే కాదు అభివృద్ధిలో కూడా ఈ గ్రామం మిగిలిన పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఊరంతా సిమెంట్ రోడ్లు, ఫంక్షన్ హాల్, డ్రైనేజ్ వ్యవస్థ, పైప్లైన్స్ ఇలా ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరగవు. పలల్ట వాసుదేవ నాయుడు ఈ ఊరికి తొలి సర్పంచ్. నాటి నుంచి నేటి వరకు ఆయన వారసులే సర్పంచ్లు. వీరే ఊరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గ్రామంలో ఏదైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ఓ కమిటీ ఉంది. ఈ కమిటీ సభ్యులు ప్రతి చిన్న సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా కృషి చేస్తున్నారు.