నారా లోకేష్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ పదవి కంటే కూడా చంద్రబాబు తనయుడిగా గుర్తింపే ఎక్కువ. తండ్రిచాటు బిడ్డగా పెరిగిన నారా లోకేష్ ఇపుడు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి, టీడీపీ శ్రేణులతో మమేకమై పోతున్నాడు. దీంతో ఆయనకు మంత్రిపదవి కట్టబెట్టాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబు అనుచరులు కాస్తంత గట్టిగానే అరిచిగీపెట్టారు. అయితే, రాజకీయ సమీకరణాలు, వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని లోకేష్కు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టలేదు.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అవుతారంటూ తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి ఘంటాపథంగా చెపుతున్నారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ 'ఇది నామాట. నామాటే వేదవాక్కు. నా మాట తప్పిన సందర్భంలేదు. గతాన్ని తరచి చూసుకోండి.. నేను చెప్పిన వన్నీ జరిగిపోయాయి. భవిష్యత్తూ అంతే. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాలోకేష్' అంటూ ఆయన కుండబద్ధలు కొడుతున్నారు.
దీనికి కారణం.. గ్రహబలం, వాస్తురీత్యా ఇది ముమ్మాటికీ నిజమౌతుందంటున్నారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని చెప్పానని ఆ యేడాది జరిగిన ఎన్నికలకు ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. 2016 ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే పార్టీనే గెలుస్తుందని, అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పగా, అది కూడా ఫలించినట్టు తెలిపారు.