నా భార్యను బ్రోకర్లు సౌదీకి అమ్మేశారు... ప్లీజ్ రక్షించండి.. రేణిగుంట వాసి రోదన
నా భార్యను బ్రోకర్లు సౌదీ సేఠ్లకు అమ్మేశారు. ఆమె ఇపుడు నరకం అనుభవిస్తోంది. ప్లీజ్ రక్షించండి అంటూ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. తాజాగా వెలుగులోక
నా భార్యను బ్రోకర్లు సౌదీ సేఠ్లకు అమ్మేశారు. ఆమె ఇపుడు నరకం అనుభవిస్తోంది. ప్లీజ్ రక్షించండి అంటూ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే...
తిరుపతి, రేణిగుంట బుగ్గ వీధిలో ఎస్.పి.జాకీర్ హుస్సేన్, షహనాజ్ (39) అనే దంపతులు నివాసముంటూ వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో హాకర్ వ్యాపారం చేసుకునే జాకీర్కు ఏడాది కిందట పక్షవాతం వచ్చింది. ఓ కుమార్తెకు చర్మవ్యాధి సోకింది. దీంతో ఆ కుటుంబం కష్టాల పాలైంది. కొన్ని రోజుల తర్వాత జాకీర్ స్వల్పంగా కోలుకుని మళ్లీ రైల్వే స్టేషన్లో వ్యాపారం చేయసాగాడు.
రోజంతా శ్రమించినప్పటికీ.. కుటుంబ పోషణ సంగతి అటుంచి.. మందుల ఖర్చులకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో షహనాజ్కు విదేశాల్లో మహిళలకు ఉద్యోగాలిప్పించే బ్రోకర్ షబానా బేగంతో పరిచయం ఏర్పడింది. ఓసారి సౌదీ వెళ్లొస్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఆ బ్రోకర్ నమ్మించింది. కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో సహనాజ్ సౌదీకి వెళ్లడానికి మొగ్గుచూపారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 19వ తేదీన షహనాజ్, జాకీర్ దంపతులను షబానా ముంబైకి తీసుకెళ్లింది. అక్కడి బ్రోకర్ అహ్మద్తో కలసి ఏవో అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకుని రెండ్రోజులు అక్కడే బసచేశారు. అక్కడి నుంచి జాకీర్ను తిరిగి రేణిగుంటకు వెళ్లమని షహనాజ్ను తీసుకుని షబానా విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమి జరిగిందో జాకీర్ కుటుంబ సభ్యులకు తెలియదు.
ముంబై నుంచి వెళ్లిన 45 రోజులకు షహనాజ్ నుంచి జాకీర్కు ఫోన్ వచ్చింది. 'నాకు నరకం చూపిస్తున్నారు. చెప్పులతో కొడుతున్నారు. చెప్పుకోలేని పని చేయమంటున్నారు. ఇక నాకు చావే శరణ్యం' అంటూ సౌదీ నుంచి షహనాజ్ తన భర్త జాకీర్ హుస్సేన్కు రెండ్రోజుల ముందు ఫోన్చేసి చెపుతూ రోదించింది.
దీంతో చలించి పోయిన భర్త... పోలీసులను ఆశ్రయించాడు. 'నా భార్య సౌదీలో చిత్రహింసలు పడుతోంది. ఉద్యోగం తీసిస్తామని బ్రోకర్లు నా భార్యను అమ్మేశారు. ఆమెను ఎలాగైనా మనదేశానికి రప్పించండి' అంటూ అర్బన్ ఎస్పీ జయలక్ష్మిని తన పిల్లలతోసహా కలిసి మొరపెట్టుకున్నాడు.