తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కట్టుకున్న భర్త, కన్నతల్లి వేధింపులు తాళలేక బలవంతంగా తనువు చాలించింది. కట్టుకున్న భర్త వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు కన్నతల్లి కూడా అల్లుడికే వత్తాసు పలకడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మహిళలను భర్త, కన్నతల్లే హత్య చేసివుంటారని పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణం ఆ మహిళ పేరిట పోలీసు స్టేషన్కు వచ్చిన ఓ లేఖే కారణం. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన నకిరేకల్లో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్ మండలం నోములకు చెందిన గుర్రం పద్మ, వెంకట్ రెడ్డి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో నకిరేకల్లో ఉంటున్న పద్మ 2014 ఆగస్టు 22న కూతురు ఝాన్సీని మేనల్లుడైన నల్లగొండ మండలం దీపకుంటకు చెందిన గూడూరు విజయేందర్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించింది.
అప్పటికే హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న ఝాన్సీ హాస్టల్లో ఉంటూ ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. ఈనెల 23న నకిరేకల్లోని తల్లిగారింటికి వచ్చి 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తమామలు వచ్చి మృతదేహాన్ని గుట్టుచప్పుడుకాకుండా తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ పేరిట నకిరేకల్ స్టేషన్ ఆఫీసర్కు 28న రిజిస్టర్ పోస్టు ద్వారా ఓ లేఖ అందింది. దీంతో ఝాన్సీది ఆత్మహత్య కాదనే అనుమానం చెలరేగింది.
మేనమామ విజయేందర్ రెడ్డి నుంచి మా అమ్మ రూ.4 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేకపోయింది. బదులుగా నాతో పెండ్లి చేయాలని విజయేందర్ రెడ్డి కోరడంతో నా ప్రమేయం లేకుండానే అయిష్టంగానే పెండ్లిచేశారు. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నా తల్లికి, నా భర్తకు మధ్య సంబంధం ఉంది. విడాకులు కావాలని కోరితే రూ.20 లక్షలు విజయేందర్ రెడ్డి ఇవ్వాలన్నాడు. నేను వ్యభిచారం చేస్తే లక్షలు సంపాదించాలని ఆశించాడు. వినకపోవడంతో వ్యభిచార గృహానికి విక్రయిస్తామని బెదిరించారని పేర్కొంది.