శ్రీదేవి మరణానికి కారణం.. అప్పులు.. భర్త మరణం.. రాజకీయం
గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘ మాజీ ఛైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి ఆత్మహత్యకు గల కారణాలను ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పులు, భర్త మరణం, రాజకీయమే కారణంగా ఉన్నాయి.
గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘ మాజీ ఛైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి ఆత్మహత్యకు గల కారణాలను ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పులు, భర్త మరణం, రాజకీయమే కారణంగా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీదేవి భర్త మల్లిఖార్జున రావు నాలుగు నెలల క్రితం హృద్రోగంతో హఠాత్తుగా మరణించారు. ఇది ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఆ తర్వాత శ్రీదేవి తన భర్త కోరిక మేరకు పదవిలోనే కొనసాగేందుకు సిద్ధపడ్డారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లను ఆమె తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాచర్లలో ఓ సానుభూతిపరుడి సహా 20 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో, గోపవరపు బ్రహ్మయ్య కుటుంబానికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఈ క్రమంలో బ్రహ్మయ్య కోడలు శ్రీదేవి పేరు వెలుగులోకి వచ్చింది. మొదటి రెండేళ్లు శ్రీదేవికి, తదుపరి రెండేళ్లు నెల్లూరి మంగమ్మకు, చివరి సంవత్సరం మైనార్టీలకు అవకాశం కల్పించాలని ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఛైర్పర్సన్గా శ్రీదేవి పగ్గాలు చేపట్టారు. కానీ రెండేళ్లపాటు ఆమె నిర్వహించిన సాధారణ, అత్యవసర సమావేశాల్లో సొంత వర్గం నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తమ పదవీ కాలంలో ఏ ఒక్కరూ సహకరించలేదని, మరో ఆరునెలలు తామే కొనసాగుతామని శ్రీదేవి భర్త మల్లికార్జునరావు తేల్చిచెప్పారు. దీంతో, ఒప్పందం ఉల్లంఘిస్తున్నామని జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో శ్రీదేవికి మద్దతుగా ఉన్న వారు కూడా వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలో శ్రీదేవి వర్గీయులపై తీవ్రంగా ఒత్తిడి వచ్చింది. ఇదేసమయంలో ఆమె భర్త మల్లికార్జునరావు హృద్రోగానికి గురై మృతి చెందాడు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి ఆమెకు నచ్చచెప్పారు. ఎన్నికల్లో వెచ్చించిన ఖర్చులో కొంత మొత్తాన్ని ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె వైదొలిగారు. కానీ, ఖర్చుల నిమిత్తం ఇస్తామన్న మొత్తం కూడా పూర్తిగా ఇవ్వలేదు. మరోవైపు.. అప్పులు చుట్టుముట్టాయి. వీటన్నింటితో పాటు.. భర్త మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. అదేసమయంలో రాజకీయంగానూ దాదాపుగా ఒంటరి కావడంతో మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.