మాతృత్వానికే మచ్చ తెచ్చింది. సహజీవనానికి అడ్డున్నాడనే అక్కసుతో కన్నబిడ్డనే పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలోని బాలాగఢ్ జిల్లా నుంచి వచ్చి ప్రియుడు రాజారావుతో కలిసి గోసాలకు వచ్చి జీవిస్తోంది.
పెనమలూరు మండలం గోసాలలో ఐదేళ్ల కుమారుడ్ని రేఖ మహిళ తన ప్రియుడితో కలిసి హతమార్చింది. ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని ప్రియుడు రాజారావు నేలకేసి కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను కళ్లారా చూసినా ఆ తల్లి హృదయం ఏమాత్రం కరగలేదు.
అలా మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో రేఖ, రాజారావును నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇరువురిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.