కర్నూలు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష రెండోరోజు కొనసాగుతుంది. కొంచెం నీరసంగా ఉన్నా... వేదికపైకి వచ్చి కూర్చున్న జగన్ ఈ రోజు ముస్లిం మత పెద్దలను వేదికపై కలిశారు. నగరానికి చెందినా ముస్లిములు దీక్ష శిబిరంలో ప్రార్థనలు నిర్వహించారు. ఎండ తీవ్రత.. ఉక్కపోతతో దీక్షా ప్రాంగణం అంతా మంటలు పుడుతున్నాయి. అయినా కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు.
ఉదయం నుంచి పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు రోజా, విశ్వేరరా రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, బుట్ట రేణుక, కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య తదితరులు వేదికపై ఉన్నారు. స్థానికులు తరలివచ్చి జల దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ కర్నూల్ జిల్లాలో మూడు రోజుల పాటు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.