విజయవాడ : ప్రగతిరథ చక్రాలు అప్పులబాట పట్టాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు ఆర్టీసీ రీజియన్లలో అప్పు చేయనిదే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమనే పరిస్థితి వచ్చింది. సంస్థలో కేంద్ర, రాష్ట్రాల ఈక్విటీ ఉన్నా.. ఆదుకునే వారు లేకపోవడంతో ఆస్తులను
విజయవాడ : ప్రగతిరథ చక్రాలు అప్పులబాట పట్టాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు ఆర్టీసీ రీజియన్లలో అప్పు చేయనిదే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమనే పరిస్థితి వచ్చింది. సంస్థలో కేంద్ర, రాష్ట్రాల ఈక్విటీ ఉన్నా.. ఆదుకునే వారు లేకపోవడంతో ఆస్తులను తాకట్టు పెట్టుకునే పరిస్థితికి సంస్థ దిగజారింది. ఇప్పటికే ఒకసారి తాకట్టు పెట్టిన విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్, గుంటూరు ఎన్టీఆర్ బస్స్టేషన్లను ఇపుడు రెండో దఫా కూడా తాకట్టు పెడుతున్నారు. గుంటూరు బస్టాండును రూ.100 కోట్లకు, విజయవాడ బస్టాండును రూ.1000 కోట్లకు తాకట్టు పెట్టాలన్న ప్రతిపాదన సిద్ధమయింది.
ఐదేళ్ల కిందట విజయవాడ, గుంటూరు బస్స్టేషన్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.200 కోట్ల మేర ఆర్టీసీ రుణం పొందింది. ఇప్పుడు విజయవాడ బస్టాండును ఏకంగా 1000 కోట్లకు తాకట్టు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ప్రధాన కేంద్రం విజయవాడలోనే ఏర్పాటైంది. ఆసియాలో రెండో అతి పెద్దదిగా భాసిల్లుతున్న విజయవాడ బస్టాండ్ పరిధిలో ‘ఆర్టీసీ హౌజ్’, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లను ఏర్పాటు చేశారు. ఏపీలో విజయవాడ నుంచే ఆర్టీసీ కేంద్ర కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎయిర్పోర్టును తలదన్నే విధంగా ఆధునీకరించారు. మల్టీప్లెక్సులను కూడా నిర్మించారు. బస్స్టేషన్ కాస్తా ఎంటర్టైనమెంట్ కేంద్రంగా మారింది. భవిష్యత్తులో మెట్రో ప్రధాన స్టేషను కూడా దీని ఎదురుగానే ఏర్పడబోతోంది. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ బస్సు స్టేషన్ ముఖ విలువ పెరిగింది.
కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. విజయవాడ, గుంటూరు, చుట్టు పక్కల జిల్లాల్లో రోడ్డు రవాణాతో సమాంతరంగా రైల్ నెట్వర్క్ ఉంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు వేళ్లూనుకోవడంతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి తీరని నష్టం కలుగుతోంది. ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగం పెరగటం కూడా ఆర్టీసీపై ప్రభావం చూపుతోంది. ఆర్టీసీ లాభాలు సాధించడం గగనంగా మారింది.
కొంతకాలంగా ఆర్టీసీ మనుగడ సొంత ఆస్తుల తనఖా పైనే సాగుతోంది. బస్స్టేషన్లను తాకట్టు పెట్టి గతంలో 200 కోట్ల రుణం తీసుకోవటం ఈ కోవలోనిదే. నష్టాలలో ఉన్నా నిదానంగా అప్పులు ఆర్టీసీ అప్పులు తీరుస్తోంది. కిందటిసారి పీఎన్బీఎస్ తీసుకున్న రూ.100 కోట్ల అప్పు వచ్చే నెలలో తీరబోతోంది. ఈ నేపథ్యంలో ఈసారి రూ.1000 కోట్ల అప్పు తీసుకోవాలని భావిస్తోంది. గుంటూరు బస్స్టేషన్ పైన కిందటిసారి తీసుకున్న రూ.100 కోట్ల అప్పు తీరలేదు. మరో 100 కోట్లకు మళ్లీ తాకట్టుకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ రూ.500 కోట్ల నష్టంతో నడుస్తోందని, దీనిని పూరించేందుకు వివిధ ఆదాయమార్గాలు అన్వేషిస్తున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ ఎ.రామకృష్ణ చెపుతున్నారు.