ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఊరూవాడాల్లో ప్రచారం చేయడంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
గతంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదం స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతకాలతో ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
అలాగే, యూపీఏ మిత్ర పక్షాలు, భావసారూప్యత కల్గిన పార్టీలన్నీ ప్రత్యేక హోదా సాధన కోసం తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. అందుకే ఈ బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ - టీడీపీలు కుట్రపన్ని రాజ్యసభలో ఓటింగ్ జరుగకుండా వాయిదా వేశాయని ఆరోపించారు.
అయితే, తాము మాత్రం ఓ పవిత్రమైన ఆశయంతో బిల్లును ప్రవేశపెట్టామని, ఈ బిల్లు వర్షాకాల సమావేశాల్లోనైనా ఆమోదం పొందుతుందని, ఆంధ్రులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్పుకొచ్చారు.